ఐపీఎల్‌లో అత్యధిక 'మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌' అవార్డులు గెలిచిన వారు ఎవరంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2020 11:12 AM GMT
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన వారు ఎవరంటే..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈ వేదికగా జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు అక్కడకి చేరుకుని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఈ సీజన్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు. ఐపీఎల్‌ అంటేనే హిట్టింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను చూశాం. ఎంతో మంది తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. తమ జట్లకు ఒంటి చేత్తో విజయాలను అందించారు. ఇప్పటి వరకు విజయవంతంగా ఐపీఎల్‌ 12 సీజన్లు పూర్తి చేసుకుని 13వ సీజన్‌కు సిద్దమైంది. మరీ ఏ ఆటగాడు ఎన్ని సార్లు మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడో ఓ సారి చూద్దాం.

1. క్రిస్‌గేల్‌ : విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు క్రిస్‌గేల్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్నిలీగుల్లో ఆడుతూ.. యూనివర్సల్‌ బాస్‌గా పేరు తెచ్చుకున్నాడు క్రిస్‌ గేల్‌. ఇప్పటి వరకు ఐపీఎల్‌ వివిధ జట్ల తరుపున గేల్‌ ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ 125 మ్యాచ్‌లు ఆడిన గేల్ 4,484 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 175 పరుగులు. మొత్తంగా గేల్‌ 21 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

2. ఏబీ డివిలియర్స్‌ : అభిమానులు అంతా ఏబీ డివిలియర్స్‌ను ముద్దుగా 360డిగ్రీస్‌ అని పిలుచుకుంటారు. బంతిని అన్ని యాంగిల్స్‌లోనూ బాదడం ఏబీ ప్రత్యేకత. ఐపీఎల్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 4,395 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 133 పరుగులు. మొత్తంగా డివిలియర్స్‌ 20 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు.

3.ఎంఎస్ ధోని : ఐపీఎల్ లో ఇప్పటివరకు 190 మ్యాచ్ లు ఆడిన మిస్టర్‌ కూల్‌ 4,432 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 84. మొత్తంగా ధోని 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను దక్కించుకున్నాడు.

4. రోహిత్‌ శర్మ : అభిమానులు అంతా రోహిత్‌ శర్మను ముద్దుగా హిట్‌ మ్యాన్‌ అని పిలుచుకుంటారు. ఈ ముంబై కెప్టెన్‌ ఐపీఎల్‌లో 188 మ్యాచ్‌లు ఆడి 4,898 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్‌ 109. మొత్తంగా రోహిత్ శర్మ 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు.

5.డేవిడ్ వార్నర్‌ : ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్‌లో 126 మ్యాచ్‌లు ఆడి 4,706 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 126. మొత్తంగా డేవిడ్ వార్నర్‌ 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇంకా అత్యధిక మ్యాన్‌ అవార్డులు సొంతం చేసుకున్న వారి జాబితాలో యూసప్‌ పఠాన్‌ 16, షేన్‌ వాట్సన్‌ 15, సురేష్‌ రైనా 14, అజింక్యా రహానే 12, గౌతం గంభీర్‌ 12, మైకేల్‌ హస్సీ 12, విరాట్‌ కోహ్లీ 12, ఆండ్రూ రసెల్‌ 11, అమిత్‌ మిశ్రా 11, డ్వేన్‌ స్మిత్ 11, వీరేంద్ర సెహ్వాగ్‌ 11, కలిస్‌ 10, పొలార్డ్‌ 10 లు ఉన్నారు.

Next Story