మోడీ ఇడ్లీలు.. రూ.10 రూపాయలకే నాలుగు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 10:38 AM GMT
మోడీ ఇడ్లీలు.. రూ.10 రూపాయలకే నాలుగు

త్వరలో మార్కెట్‌లోకి మోడీ ఇడ్లీలు రానున్నాయి. అది కూడా అతి తక్కువ ధరకే. కేవలం రూ.10రూపాయలకు నాలుగు ఇడ్లీలు ఇవ్వనున్నారు. అయితే.. ఇది మన దగ్గర కాదులెండి. తమిళనాడులో. తమిళనాడులోని సేలం జిల్లాలో ప్రధాని మోదీ పేరిట ఇడ్లీలను తయారు చేసి హోటళ్లలో అమ్మే సరికొత్త ప్రచారాన్ని అక్కడి బీజేపీ శాఖ చేపడుతోంది. ‘మోదీ ఇడ్లీస్, 10 రూపాయలకు నాలుగు’ అంటూ అక్కడి కమలం పార్టీ నేత మహేష్ ఇందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్లను, ప్లెక్సీలను కూడా సిద్ధం చేశారు.

సేలం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని అందించనున్నారు. వీటికి వచ్చే ఆదరణ బట్టి మరిన్ని హోటళ్లలో ఈ ‘మోడీ ఇడ్లీస్’ను విస్తరిస్తామని మహేశ్ చెబుతున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా వీస్తున్న ప్రధాని మోదీ ప్రభంజనం తమిళనాడులోనూ విస్తరించాలన్నదే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడేలా ఈ వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టామని బీజేపీ నేతగా ఎదగాలనుకుంటున్న మహేశ్ అంటున్నారు. ప్రతి రోజూ 40 వేల ఇడ్లీలను తయారు చేసి ప్రజలకు రుచికరమైన ఆహారం అందిస్తామన్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో వచ్చే వారం హోటళ్లను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రచార పత్రాల పై మోడీ ఫొటోలతో పాటు మహేష్ ఫోటోలను కూడా వేశారు.

Untitled 5 Copy

Next Story