మియాపూర్లో కారు బీభత్సం.. ఒకరి మృతి
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Feb 2020 12:00 PM IST
హైదరాబాద్ నగర శివారు మియాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పి విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టడమే కాకుండా.. అదే వేగంతో ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో మృతిచెందిన అఫ్జల్ ఓ ప్రయివేటు పాఠశాల కరస్పాండెంట్. ప్రమాదానికి కారణమైన సంతోష్ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడ వాహనదారులు హడలిపోయారు. పాదచారులు పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును హోటల్ నుంచి బయటకు తీశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.