మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు : మంత్రి తలసాని
By రాణి Published on 30 March 2020 1:03 PM GMTతెలంగాణలో మాంసం ఉత్పత్తులను పెంచి.. పెరిగిన ధరలను అదుపులోకి తీసుకొస్తామని తెలిపారు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో నాన్ వెజ్ ఉత్పత్తులపై మాసబ్ ట్యాంక్ లో గల పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. లాక్ డౌన్ సమయంలో కూరగాయలే కాకుండా చికెన్, మటన్, చేపల ధరల పెంపుపై ఆయన అధికారులతో చర్చించారు. లాక్ డౌన్ కారణంగా మేకలు, గొర్రెల ఉత్పత్తులు లేక మటన్ ధరలు పెరిగాయన్నారు. అయితే అధిక ధరలకు మాంసాన్ని విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేసి ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
Also Readd : శ్రీవారి దర్శనం నిలిపివేత : గడువు పెంచిన టిటిడి
కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మేకలు, గొర్రెలు, కోళ్ల రవాణాకు తాత్కాలికంగా నిలిచిపోయింది. అందులోనూ మొన్నటి వరకూ చికెన్, మటన్ తినడం వల్ల కూడా కరోనా సోకుతుందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు రావడంతో ప్రజలు వాటి జోలికే వెళ్లలేదు. మంత్రి ఈటెల మాంసం ఉత్పత్తులు తినడం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి, కరోనా సోకకుండా ఉంటుందని చెప్పడంతో మాంసం ధరలు అందలాన్నెక్కాయి. కిలో చికెన్ ధర నగరాల్లో రూ. 30 ఉండగా..ఒక్కసారిగా రూ. 240కు పెరిగిపోయింది. మటన్ కూడా కిలో రూ. 800 కు విక్రయిస్తున్నారు.
Also Readd : సిసిసి కి ప్రభాస్, బన్నీ విరాళం