మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2020 10:01 AM GMTకరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. చిన్నా-పెద్ద, పేద- ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు కూడా ఈ మహమ్మారి సోకింది. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కూడా కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. గత ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో మల్లారెడ్డికి పాజిటివ్గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు మంత్రి ప్రస్తుతం సెల్ప్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు.
ఇక తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగస్టు 7న శుక్రవారం) 23,322 శాంపిల్స్ను పరీక్షించగా.. కొత్తగా మరో 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 14 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 77,513కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 615 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,091మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 54,330కి చేరింది. 22,568 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.