ఓల్డ్ సిటీలో కరోనాతో మరో ఆభరణాల వ్యాపారి మృతి.. ఆ కుటుంబాల్లో గుబులు 

By సుభాష్  Published on  16 July 2020 4:18 AM GMT
ఓల్డ్ సిటీలో కరోనాతో మరో ఆభరణాల వ్యాపారి మృతి.. ఆ కుటుంబాల్లో గుబులు 

హైదరాబాద్ లోని బిజినెస్ కమ్యూనిటీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మరో ప్రముఖ ఆభరణాల వ్యాపారి మరణించాడు. కరోనాతో మరణించిన నాలుగో ఆభరణాల వ్యాపారి కావడంతో ఆభరణాల వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఆభరణాల వ్యాపారుల కుటుంబాల్లో 300 మందికి పైగా కరోనా బారిన పడ్డారంటే ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నెలరోజుల్లోనే ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోయాయి. ఇటీవల పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లకు సదరు కుటుంబాలు హాజరయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ వీరు ఈ విషయాన్ని కనీసం పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలలో కరోనా పాజిటివ్ వ్యక్తులు చేరడం.. ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం జరిగిపోయాయి.

తాజాగా చనిపోయిన ఆభరణాల వర్తకుడి వయసు 40ల్లో ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నానని భావించాడు అతడు. సోమవారం కూడా మరో షాపు యజమాని కరోనా కారణంగా మరణించాడు. ఆ కుటుంబాలకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం 48 సంవత్సరాలు ఉన్న మరో ఆభరణాల వ్యాపారి అతడి ఇద్దరి సోదరులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. గత 15రోజులుగా గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముగ్గురు సోదరులు వెళ్లారు. ఇద్దరు బంజారా హిల్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉండగా.. ఇంకొక వ్యక్తి జూబ్లీ హిల్స్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. చివరి సోదరుడి మామకు మొదట కోవిద్-19 సోకింది.. ఆ తర్వాత కుటుంబం మొత్తానికి సోకింది. తమ కమ్యూనిటీలో చాలా మంది పెళ్లిళ్లకు, పార్టీలకు హాజరయ్యారని ఆయన కూడా హాజరు అయ్యారో లేదో క్లారిటీ లేదని అన్నారు. ఆసుపత్రికి వెళ్లి రావడం వలన ఆయనకు కరోనా సోకిందా అని కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగుందని.. ఎటువంటి సమస్యలు లేవని చెబుతున్నారు. అయితే సోమవారం ఉదయం ఆయన మరణించారు.

ఈ కుటుంబం ఓల్డ్ సిటీ లోని ఘాన్సీ బజార్ లో జ్యువలరీ షాప్ ను నడుపుతూ ఉంది. 2008లో షాపును రిజిస్టర్ చేశారు. ప్రముఖ డైమండ్ జ్యువలరీ షాప్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

మొదట కరోనా వైరస్ సోకి మరణించిన ఆభరణాల వ్యాపారి బర్త్ డే పార్టీ వేడుకలు హాజరయ్యాడు. పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా కరోనా కారణంగా మరణించాడు. ఈ పార్టీలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా సోకింది. చనిపోయిన మరో ఇద్దరు ఆభరణాల వ్యాపారులు పెళ్లికి హాజరయ్యారు. 95శాతం ఇన్ఫెక్షన్లు సామాజిక దూరం పాటించని ఈ వేడుకలకు హాజరవ్వడం వలనే జరిగిందని కుటుంబాలకు చెందిన సన్నిహితులు చెబుతూ ఉన్నారు.

Next Story