మసూద్ అజహర్ అడ్రస్ తెలియడం లేదు.. పాకిస్తాన్ కొత్త నాటకం
By సుభాష్
కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, ఆయన కుటుంబం అడ్రస్ ఎక్కాడ తెలియడం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. కొన్ని రోజులుగా వీరు ఎక్కడుంటున్నారో తెలియడం లేదంటూ అమాయకంగా పాక్ కొత్త నాటకం ఆడుతోంది. మనీ లాండరింగ్, టెర్రరిస్టుల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధుల పంపిణీని అడ్డుకునేందుకు ఉద్దేశించి పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరి సమావేశంలో పాక్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, మసూద్ మృతి చెందాడని ఒక వైపు వార్తలు వస్తుండగా, మరో వైపు అతడు పాకిస్తాన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని కథనాలు కూడా వచ్చాయి. అలాగే మసూద్ అహ్మద్ ను పాక్ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ఉంచినట్లు ఆరోపణలు లేకపోలేదు. జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం అయిన మార్కాజ్ ఉస్మాన్ ఆలీ వద్ద మసూద్ను ఉంచినట్లు ఆరోపణలున్నాయి.
సంస్థ హెచ్చరించినా.. స్పందించని పాక్
పాక్లో ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను 2019 అక్టోబర్ నెల వరకు వివరించాలని, లేని పక్షంలో మీ దేశాన్ని ఇరాన్, నార్త్ కోరియాలతో పాటు బ్లాక్ లిస్టులో పెడతామని ఆ సంస్థ పాక్ను హెచ్చరించింది. ఆ హెచ్చరికలను పాక్ ఏ మాత్రం స్పందించకపోవడంతో, పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గత ఏడాది బ్లాక్ లిస్టులో పెట్టింది.
గత ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా దాడి ఘటన బాధ్యత తమదే అని మసూద్ అజాహర్ ఆధ్వర్యంలో జైషే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అజహర్ ను ఐక్యరాజ్యసమితి, అమెరికా.. గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. అయితే పాకిస్తాన్ను సమర్ధిస్తున్న దేశాల్లో చైనాతో పాటు టర్కీ దేశం కూడా ఉంది.
కశ్మీర్ అంశంపై పాక్ వైఖరిని సమర్ధిస్తూ..
ఇటీవల పాక్ పార్లమెంట్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రసంగించారు. కశ్మీర్ అంశంపై పాక్ వైఖరిని సమర్ధించారు. పైగా భారత ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇది తమ అంతర్గత సమస్య అని తెలిపిన భారత ప్రకటనను పట్టించుకోకుండా ఆయన చేసిన ప్రసంగాన్ని యూఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాక్ను ఎన్నిసార్లు ఎండగట్టినా.. పాక్ బుద్ది మాత్రం మారడం లేదు.