పంథా మార్చని మావోలు...!
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Sep 2019 6:49 AM GMT* 15 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు
* నిఘా నీడలో ఏజెన్సీలు
* అయినా ఆగని ఆవిర్భావ వేడుకలు
* పట్టుకోసం పోలీసులు
* ఉనికి కోసం ఉద్యమ నేతలు
ఆకు కదలితే చాలు అరణ్యాలు వణుకుతున్నాయి. అడవుల్లో తూనీగ జోరుల్లా తూటాల మోతలు మొగుతున్నాయి.
భారత ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో పేదరికం, అసమానతలు పేరుకుపోయాయి. ఖనిజ సంపద పేరుతో.. ప్రభుత్వాలు అనుసరించిన తీరుతో.. లక్షలమంది ఆదివాసీలు తమ భూములు కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వాల చేత మోసాగించబడిన పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచేందుకు ఉద్భవించిందే భారత కమ్యూనిస్టు పార్టీ. ఆశయాల అజ్ఞాతపు బాటపట్టి అసువులు బాస్తున్న అమర వీరులు ఎందరో...? తన పదిహేనేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒత్తిళ్ళు, ఒడిదొడుకులను ఎదుర్కొంటూ గమ్యం దిశగా అలుపెరగని పోరాటం సాగిస్తోంది మావోయిస్టు పార్టీ. 2004 సెప్టెంబర్ 21న ఓ సరికొత్త ఉద్యమ పంథాలోంచి ఆవిర్భవించిందే మావోయిస్టు పార్టీ.
మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం
భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి భారతదేశంలో మావోయిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడం, రాష్ట్ర యంత్రాంగాలను సమూలంగా నాశనం చేసి, సోషలిస్ట్ - కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఏర్పఫైనదే మావోయిస్ట్ పార్టీ.
దేశంలో ప్రధాన వర్గాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), పీపుల్స్ వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ) మరియు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసిసిఐ)ల కలయికతో 21 సెప్టెంబర్ 2004 న మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. అక్టోబర్ 14 న వీటి విలీనాన్ని అధికారికంగా ప్రకటించబడింది. విలీన సమయంలో తాత్కాలిక కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ పూర్వపు నాయకుడు ముప్పల లక్ష్మణారావు అలియాస్ "గణపతి" ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), నక్సల్బరీ సిపిఐ (మావోయిస్ట్) మే 2014 న మావోయిస్ట్ పార్టీలో విలీనం అయ్యింది. పశ్చిమ బెంగాల్లో 1967లో రాడికల్ మావోయిస్టులు నిర్వహించిన నక్సల్బరి తిరుగుబాటే మావోయిస్ట్ పార్టీ ఏర్పాటుకు స్ఫూర్తి అని మేధావులు అభివర్ణిస్తారు. మావోయిస్ట్ పార్టీ చట్టవిరుద్ధ కార్యకలాపాలు.. దేశంలో నివారణ చట్టం కింద ఒక ఉగ్రవాద సంస్థగా నిషేదించబడింది.
1967లో అసంతృప్తితో మొదలయినప్పటికి 1990లో ప్రభుత్వ నెయోలిబరలిజం నీడన పెరిగినా నెమ్మదిగా తన తీరు తెన్నులను మార్చుకుంటూ 2004 సెప్టెంబర్ 21 నాటికి పూర్తిస్థాయిలో మావోయిస్ట్ పార్టీ ఏర్పాటైంది. 1980లో పిడబ్ల్యుజీ పోలీసులపై గెరిల్లా తరహా దాడులను ప్రారంభించింది. చట్టవిరుద్ధమైన మరణశిక్షలతో స్పందించారు. 2002 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిడబ్ల్యుజీని నిషేధించింది. దీనిపై స్పందించిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, భూస్వాములు, వ్యాపార యజమానులపై దాడులు ముమ్మరం చేశాయి. 2004 చివరినాటికి నక్సలైట్లు గ్రామీణ భారతదేశంలో చాలా వరకు వ్యాపించి సమాంతర పాలన ఏర్పాటు చేశారు.
పాలకులపై పైచేయి...
పాలక ప్రభుత్వాలు సృష్టిస్తున్న పెను సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు, ప్రణాళికలు పదును పెడుతూ ప్రభుత్వాలపై పైచేయి సాధించిన ఘటనలు కోకొల్లలు.
సల్వాజుడుం ఆరాచకాలపై 2011లో దేశ అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి అక్షింతలు వేసి దాన్ని రద్దు చేయించడంలో విజయం సాధించింది మావో పార్టీ. 2013 మే 25న సల్వాజుడుం వ్యవస్థాపకుడిపై తూటాల వర్షం కురిపించి హతమార్చింది. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ కూంబింగ్ లు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై విరుచుకు పడుతూ వారిని హతమార్చుతూ పాలకులపై పైచేయి సాధిస్తున్నారు. పార్టీలో యువ రక్తాన్ని నింపేందుకు పెద్ద ఎత్తున యువతను ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు.
పదిహేనేళ్ల ప్రస్థానంలో లొంగుబాటు కుంగుబాటులెన్నో..
పదిహేనేళ్ళ మావోల ప్రస్థానంలో ఎన్నో లొంగుబాట్లు, కుంగుబాట్లు చోటుచేసుకున్నాయి. మావోలు అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులను చవిచూసి పాలక ప్రభుత్వాల సవాళ్లకు ఎదురొడ్డి నిలిచింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని అంబూజ్మడ్ కేంద్రంగా మావోల ప్రస్థానం మొదలయ్యింది. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. నేపాల్ వరకు తమ కార్యకలాపాలను విస్తరింపచేయాలనే ఏకైక లక్ష్యంతో గడచిన 15 ఏళ్లుగా విప్లవ పంథాను కొనసాగిస్తోంది. జార్కండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్ఘడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో నక్సల్స్ పార్టీ వ్యాపించింది.
అయితే.. ప్రభుత్వాలు మావోల ఆగడాలను అరికట్టేందుకు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎన్నో ఆపరేషన్స్ మొదలు పెట్టింది. నక్సలైట్ల సొంత ఇలాఖ అయిన ఛత్తీస్ఘడ్ లో నక్సలిజానికి వ్యతిరేకంగా 2005లో అక్కడి ఆదివాసీలతో మెలిషియా, సల్వాజుడుం ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆయుధాలు సమకూర్చింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి సైనిక చర్యలను తీవ్రతరం చేసింది. 2009 మరియు 2012 మధ్య తమ రాజకీయ, ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఆయుధాల తయారీ కేంద్రాలను, సరఫరా విభాగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఒక పక్క పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎంతో మంది ముఖ్య నేతలు, సభ్యులు ఎంకౌంటర్లలో హతమౌతుంటే.. మరోపక్క లొంగుబాటు దారి పట్టారు.
2014 బీజేపీ అధికారం చేపట్టిన నాటినుండి నక్సలిజాన్ని అణచివేసేందుకు వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మోదీ ప్రభుత్వం మావోల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ సమాధాన్ పేరుతో మావోయిజాన్ని కూకటివేళ్లతో పెఖిలించాలని సీఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఐటీ బీపీ, కోబ్రా బలగాలతోను, హెలిక్యాప్టర్, డ్రోన్ల సహాయంతో అడవులను జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అగ్రనేతల వేట కొనసాగిస్తోంది. దీనికి తోడు ఉన్న సీనియర్ నాయకులను వయోభారం, అనారోగ్య సమస్యలు వేదిస్తున్నాయి. దీనితో ఉన్న కొద్దీ మంది నేతలు ఉనికి కాపాడేందుకు ఆవిర్భావ సభలను సెప్టెంబర్ 21 నుండి నవంబర్ 8 వరకు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస ఎంకౌంటర్లతో దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. అడవుల్లో తూనీగ జోరుల్లా తూటాల మోతలు మొగుతున్నాయి. దీనితో ఆకు కదలితే చాలు ఏజెన్సీలు వణుకుతున్నాయి.