బైక్‌పై మోజు.. భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భర్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 1:17 PM GMT
బైక్‌పై మోజు.. భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భర్త

మహిళలపై రోజు రోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు ఆడవాళ్లను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఓ భర్త కట్టుకున్న భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. డబ్బులిస్తే మా ఆవిడ వద్దకు పంపిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ‌ప్రదేశ్‌లోని మెహ్‌నగర్‌ పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలోని తుథియా గ్రామంలో పునీత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివస్తుండేవాడు. పెళ్లి సమయంలో కట్నంతో పాటు బైక్‌ ఇస్తామని అత్తింటి వారు మాట ఇచ్చారు. పెళ్లై ఏడాది దాటి పోయిన కానీ బైక్‌ రాలేదు. దీంతో భార్యను నిత్యం వేధించేవాడు. తనకు బైక్‌ కావాలని, పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని ఆమెను కొట్టేవాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఆగ్రహించిన పునీత్‌.. తన భార్యను అమ్మేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఆమె ఫోటోతో పాటు ఫోన్‌ నెంబర్‌ను షేర్‌ చేశాడు. కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి సంప్రదించాలని కోరాడు. దీంతో ఆమెకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. విసిగిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి భర్త పునీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story