ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నాం : మంత్రి ఈటల
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2020 2:42 PM GMT
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లిన ఏ ఒక్క రోగి కూడా వెనక్కి తిరిగి రాకుండా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చికిత్స అందిస్తామన్నారు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.
కరోనా తీవ్రత, కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ రెండు పండుగల్లో ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.