మహారాష్ట్ర, హర్యానాల్లో శాంతియుతంగా పోలింగ్
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 3:38 AM GMTమహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 , హర్యానాలోని 90 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రంలో 3 లక్షల మందిని, హర్యానాలో 75వేల మంది పోలీసులను మోహరించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా చేపట్టారు. అలానే..దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.మహారాష్ట్రలో మధ్యాహ్నం ఒంటి గంటకు 22.79 శాతం, హర్యానాలో మధ్యాహ్నం ఒంటిగంటకు 33.46 శాతం పోలింగ్ నమోదైంది. ముంబైలో 25 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
ఓటుహక్కు వినియోగించుకున్న సచిన్, కుమార్తె, కుమారుడు
ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ స్టార్ లు
ఓటు హక్కు వినియోగించుకున్న జెనీలియా దంపతులు.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆయన భార్య అమృత, తల్లి సరిత నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ కూడా కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు.
థాకరే కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్దవ్ , రాజ్ థాకరేలు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.
పోలింగ్ బూత్కి సైకిల్పై సీఎం
ఇక..హర్యానా సీఎం ఖట్టర్ పోలింగ్ స్టేషన్కు సైకిల్ పై వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభివృద్దికి ఓటువేయాలని ఖట్టర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత శరద్ పవార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనవరాలు, అల్లుడితో ఆయన పోలింగ్ బూత్కు వచ్చారు.
భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, అతని భార్య ప్రముఖ నటి లారా దత్తాలు ముంబైలో ఓటేశారు.అంతేకాదు..సినీ ప్రముఖులు జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, రవి కిషన్, కిరణ్రావ్, అమీర్ఖాన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా ట్రాక్టర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈయన ప్రకాష్ చౌతాలా కుమారుడు. కుటుంబ సభ్యులతో సహా ట్రాక్టర్ మీద వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాత బాల్ థాకరే ఆశీర్వాదం తీసుకున్న ఆదిత్య
థాకరే కుటుంబం నుంచి మొదటిసారిగా ఆదిత్య ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వర్లి నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. సిద్ది వినాయక ఆలయంలో పూజలు చేశారు. తాతా బాల్ థాకరే ఆశీర్వాదం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగపూర్లో ఓటు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలే బీజేపీని గెలిపిస్తాయని ఆయన చెప్పారు.
ఇక హర్యానాలోని అదంపూర్ నియోజకవర్గం నుంచి టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ బరిలోకి దిగారు. ఈమె బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఫొగాట్ కూడా ఉదయాన్నే ఓటు వేశారు.
దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న రెజ్లర్ ఫొగాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. బీజేపీకి ప్రజల ఆదరణ ఉందని..మోదీ నాయకత్వం, ఖట్టర్ పథకాలు మంచి విజయాన్ని ఇస్తాయని చెప్పారు.
ఇక రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈయన బీజేపీ తరపున బరోడా నుంచి పోటీ చేస్తున్నారు.
పోలింగ్ అప్ డేట్స్
ఎన్సీపీ నాయకురాలు, శరద్ పవార్ కుతూరు సుప్రీయా సూలే భారమతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే వారికి ఓటు వేసినట్లు చెప్పారు. భారామతిలో ఎన్సీపీ తరపున అజిత్ పవార్ బరిలో ఉన్నారు.
ఎన్సీపీ బాగా పట్టుకున్న ప్రాంతం భారామతి. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా ఓటు వేయాలన్నారు.
ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు
యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని వికసింపచేద్దాం- మోదీ
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని వికసింపచేయాని ఓటర్లకు పిలుపునిచ్చారు.