మరో రెండేళ్ల పాటు మారటోరియం గడువు పొడిగించవచ్చు.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

By సుభాష్  Published on  1 Sep 2020 8:13 AM GMT
మరో రెండేళ్ల పాటు మారటోరియం గడువు పొడిగించవచ్చు.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

దేశంలో కరోనా వల్ల లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల నాటి నుంచి సాధారణ ప్రజలు, సంస్థలు, వ్యాపార రంగాలు అనేకమైన నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో మారటోరియం విషయంలో గడువు పొడిగించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రుణ మారటోరియం కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు రుణ మారటోరియం కాలపరిమితిని రెండు సంవత్సరాల వరకు పొడిగింపు ఉంటుందని పేర్కొంది.

మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ విషయమై కేంద్ర అధికారులు, బ్యాంకర్ల సంఘాలు, ఆర్బీఐ కలిసి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర సర్కార్‌ తెలిపింది. అయితే కేంద్రం ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభించిందని, మారటోరియం గడువును పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రుణ మారటోరియానికి సంబంధించి వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ కొందరు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. వడ్డీ మాఫీ విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, జీడీపీ 23 శాతం తగ్గిందని, ఎకనామి పరిస్థితి కూడా సరిగ్గా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అఫిడవిట్‌ అందనందున సుప్రీం కోర్టు ఈ అంశంపై విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

Next Story