కరోనా ఎఫెక్ట్‌: అక్రమంగా మద్యం అమ్మకాలు.. పట్టుకున్న పోలీసులు

By సుభాష్  Published on  26 March 2020 5:56 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: అక్రమంగా మద్యం అమ్మకాలు.. పట్టుకున్న పోలీసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 19వేలకు చేరుకుంది. ఇక చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉన్నారు. ఇక భారత్‌లో మృతుల సంఖ్య 12కు చేరగా, చికిత్స పొందుతున్నవారి సంఖ్య 600 దాటిపోయింది. ఇక తెలంగాణలో మరణాలు సంభవించకపోయినా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు సైతం నిలిపివేశారు.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది కేంద్రం. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమంగా మద్యం అమ్మకాలు చేయడమే కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకుని అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాశ్‌ నగర్‌లో ఆదాయ పన్ను కార్యాలయం పక్కనే ఉన్న విద్యా విహార్‌ అపార్ట్‌ మెంట్‌లో ఓ ప్లాట్‌లో ఓ వ్యక్తి అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహంచి ఇంట్లో బాత్రూమ్‌లో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story