మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 10:42 AM GMT
మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ పై జ‌తీయ హ‌రిత ట్రైబ్యున‌ల్‌(ఎన్‌జీటీ)లో విచార‌ణ జ‌రిగింది. విశ్రాంత న్యాయ‌మూర్తి శేష‌శ‌య‌నరెడ్డి నేతృత్వంలోని 5 గురు స‌భ్యులు గ‌ల క‌మిటీ నివేదిక త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించింది. స్టైరిన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం, భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విచార‌ణ క‌మిటీ నివేదిక‌పై అభ్యంత‌రాల‌ను ఒక రోజులో చెప్పాలని ఎన్‌జీటీ తెలిపింది.

ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్‌జీటీకీ లేదని వాదించారు. ఎన్‌జీటీ సుమోటోగా విచారణ చేపట్టే అంశంపై సుప్రీంకోర్టు లో పిటిషన్ పెండింగ్ లో ఉంద‌ని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది వాదించారు.

2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని ఈఏఎస్ శర్మ వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏపీ పొల్యూషన్ బోర్డుతో కుమ్మక్కయిందని ఆరోపించారు. గ్యాస్ లీకేజీ ఘటన బాద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుమోటోగా కేసు విచారణ వద్దంటున్న నేపధ్యంలో తన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుని నోటిసులు ఇవ్వాలని శ‌ర్మ వాదించారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఎన్‌జీటీ త‌దుపరి ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Next Story