బ్రెజిల్‌ను దాటి రెండో స్థానానికి చేరిన భారత్‌

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 7 Sept 2020 10:57 AM IST

బ్రెజిల్‌ను దాటి రెండో స్థానానికి చేరిన భారత్‌

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌.. బ్రెజిల్‌ను దాటి రెండో స్థానానికి ఎగబాకింది. దేశంలో గడిచిన 24గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 42,04,614కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 32,50,429 కోలుకోగా.. 8,82,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 1,016 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 7,20,362 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 4,95,51,507 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ 64,60,250 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోండగా.. 41,37,606 కేసులతో బ్రెజిల్‌ మూడో స్థానంలో ఉంది. ఇక దేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. భారత్‌ తొలి స్థానానికి చేరడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

Next Story