భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. 24గంటల్లో 90వేల కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 5:34 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. 24గంటల్లో 90వేల కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,632 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41లక్షలు(41,13,811)కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 31,80,866 మంది కోలుకోగా.. 8,62,320 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా.. నిన్న ఒక్క రోజే 1,065 మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మరణాల సంఖ్య 70,626 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 77శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 10,92,654 శాంపిళ్లను పరీక్షించగా.. నిన్నటి వరకు మొత్తం 4,88,31,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటి వరకు 64,31,152 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 41,23,000 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో కరోనా విలయం ఇలాగే కొనసాగితే.. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానానికి అతి తొందరలో చేరడం ఖాయం.

Next Story