అందుకే కాంగ్రెస్ను వీడాను : ఖుష్బూ
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2020 7:10 AM GMT
ఇటీవల కాంగ్రెస్ను వీడీ బీజేపీలో చేరిన నటి ఖుష్బూ.. తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలిపారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్లో రాను రానూ అసంతృప్తి పెరిగిపోతోందని, ఈ విషయంపై రాహుల్ త్వరలోనే మేల్కొంటే మంచిదని అన్నారు. ఫిబ్రవరిలోనే అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపామని.. అయితే వ్యక్తిగతంగా మాత్రం కలవలేకపోయానని ఆమె తెలిపారు.
కాంగ్రెస్లో కొందరు తనను అణచివేశారని మండిపడ్డ ఖుష్బూ, వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. అయితే.. సోనియాకు రాసిన లేఖలో మాత్రం పూర్తి వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. చాలా మంది తనను అణచివేయడానికి ప్రయత్నించారని.. రాష్ట్ర నేతల నుండి జాతీయ నేతలు వరకూ అందులో ఉన్నారని పేర్కొన్నారు. వారంతా ఢిల్లీలో ఓ కొటరీలాగా తయారయ్యారని అన్నారు.
ముఖ్యంగా రాహుల్.. ఆయన చుట్టూ ఆ కోటరీని ఏర్పర్చుకున్నారని.. కొత్తగా వచ్చే వారిని అందులోకి అనుమతించరూ.. అలాగే వారూ పారదర్శకంగా ఉండరని మండిపడ్డారు. ఈ కారణం చేతనే కాంగ్రెస్ను వీడినట్లు ఖుష్బూ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే బీజేపీ చేరాలంటూ ఆఫర్లు వచ్చాయని.. అయితే చేరడం కుదరదని బీజేపీ నేతలతో చెప్పినాని.. చివరికి పునరాలోచనలో పడి.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.