కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం
By న్యూస్మీటర్ తెలుగు
కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అల్మటీ నగరవిమానాశ్రయం నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండస్తుల భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 100మంది ఉండగా.. వీరిలో 95మంది ప్రయాణికులు.. ఐదుగురు సిబ్బంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 35 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఘటనపై స్పందించిన ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కమిషన్ను నియమిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు దేశాధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టొకాయేవ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గురయిన బెక్ ఎయిర్ విమాన సంస్థను 1999లో స్థాపించారు. తొలుత వీఐపీ సర్వీసుల్ని ప్రారంభించిన ఈ సంస్థ క్రమ క్రమంగా సాధారణ సేవల్ని కూడా మొదలుపెట్టింది.