ఆయన ఓ కండ్లున్న కబోది..!
By Newsmeter.Network
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కండ్లున్న కబోది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడిప్పుడే కేటీఆర్ రాజకీయాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యనించారు. హిందూగాల్లు బొందుగాళ్లు అంటే ఏమైందో తెలుసు కదా..? అంటూ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్లో గెలిచినా వచ్చేది టీఆర్ఎస్లోకేనని.. డేలో తిట్టుకొని నైట్ ఫోన్లో మాట్లాడుకుంటారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ సహజ మిత్రులేనని ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో చాపకింద నీరులా బీజేపీ దూసుకుపోతోందని బీజేపీ నేత కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులకు బాసటగా బీజేపీ నిలిచిందన్నారు.
రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచి.. ఆర్టీసీ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లామన్నారు. ఢిల్లీ పెద్దల హెచ్చరికలతోనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకున్నారని కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పోరాటంతోనే కేసీఆర్ వెనక్కి తగ్గరాని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 30 మంది ఆత్మహత్యలకు కారణమైన పాపం ఊరికేపొదన్నారు. ప్రజల సెంటిమెంట్తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగిందని కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నుంచి బీజేపీ వలసలు కొనసాగుతున్నాయని బీజేపీ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేకపోతోందని.. వివిధ రాష్ట్రాల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు.