ఏప్రిల్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌.. ప‌ది రోజుల్లో ప్రిలిమ్స్‌ ఫలితాలు..!

TSPSC to conduct Group-I Main exam in April 2023.టీఎస్పీఎసీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2022 3:03 AM GMT
ఏప్రిల్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌.. ప‌ది రోజుల్లో ప్రిలిమ్స్‌ ఫలితాలు..!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎసీ) గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను మ‌రో 10 రోజుల్లో వెల్ల‌డించేందుకు స‌న్నాహాకాలు చేస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షను 2023 ఏప్రిల్ నెలలో నిర్వహించాలని బావిస్తోంది. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత మెయిన్స్ ప‌రీక్ష‌కు అభ్య‌ర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మూడు నెల‌ల సమ‌యం ఇవ్వాల‌ని టీఎస్పీఎసీ యోచిస్తోంది.

ఇంటర్మీడియట్, ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలు, NEET, ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మెయిన్ పరీక్ష తేదీలను ఖ‌రారు చేయ‌నున్నారు. దీంతో ప‌రీక్ష నిర్వ‌హణ‌కు అవ‌స‌రైన కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ప్రకటించినట్లుగానే ప్రతి మల్టీ-జోన్‌లో అందుబాటులో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్యకు 50 రెట్లు మంది అభ్య‌ర్థులు మెయిన్స్ ప‌రీక్ష‌కు హాజ‌రు కానున్నారు.

అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1:50 నిష్పత్తిలో అంటే 25,150 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపిక చేయ‌నున్నారు. ఇందులో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ చేయ‌నున్నారు.

గ్రూప్ 1 స‌ర్వీసుల కింద 503 ఖాళీల భ‌ర్తీకి టీఎస్పీఎసీ నోటీఫికేష‌న్ జారీ చేసింది. వాస్త‌వానికి మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించాల‌ని బావించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు ఆల‌స్యం కావ‌డంతో మెయిన్స్ తేదీల‌పై సందిగ్ధత నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్‌లో మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని బావిస్తోంది. మరోవైపు గ్రూప్-2 సర్వీసుల కింద 728 ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ యోచిస్తోంది.

Next Story