Question paper leak: పరీక్షల రద్దుపై నేడు నిర్ణయం తీసుకోనున్న టీఎస్‌పీఎస్సీ

ప్రశ్నపత్రం లీక్‌ నేపథ్యంలో పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షరద్దు చేసే అంశంపై టీఎస్‌పీఎస్సీ నేడు నిర్ణయం తీసుకోనుంది.

By అంజి  Published on  14 March 2023 3:32 AM GMT
Question paper leak, TSPSC

పరీక్షల రద్దుపై నేడు నిర్ణయం తీసుకోనున్న టీఎస్‌పీఎస్సీ 

హైదరాబాద్‌ : ప్రశ్నపత్రం లీక్‌ నేపథ్యంలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షను రద్దు చేసే అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. ప్రశ్నపత్రం లీక్‌పై పోలీసు శాఖ సమర్పించిన నివేదికపై కమిషన్ చర్చించి, రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దుపై మంగళవారం నిర్ణయం తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి.

వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 833 ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మార్చి 5న పరీక్షను నిర్వహించింది. అనుమానాస్పద హ్యాకింగ్ కారణంగా మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, మార్చి 15 మరియు 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్షలను కమిషన్ ఇప్పటికే వాయిదా వేసింది.

ప్రశ్నాపత్రం లీక్: తొమ్మిది మంది అరెస్టు

టిఎస్‌పిఎస్‌సి అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) కి చెందిన ఇద్దరు సహా తొమ్మిది మందిని హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు హార్డ్ డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులు టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పి ప్రవీణ్ కుమార్, ఎ రాజ శేఖర్ (35) టీఎస్‌పీఎస్సీలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, రేణుక (35) ఒక స్కూల్ టీచర్, ఎల్‌ ధాక్య (38) టెక్నికల్ అసిస్టెంట్, కె. రాజేశ్వర్. (33), కె నీలేష్ నాయక్ (28), పి గోపాల్ నాయక్ (29), కె శ్రీనివాస్ (30), కె రాజేంద్ర నాయక్ (31).

పోలీసులు అనుమానితులపై సెక్షన్లు 409,420,120 (B) IPC,సెక్షన్ 66 (b) (c), 70 IT యాక్ట్, సెక్షన్ 8, పరీక్షల దుర్వినియోగాల నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రయోగించారు. కంప్యూటర్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపుతున్నారు. ఈ ముఠా ఇతర ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసి లీక్ చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుక, ప్రవీణ్‌లు గత కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసని, నిత్యం టచ్‌లో ఉంటున్నారని డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ పీ రాధా కిషన్‌రావు తెలిపారు. నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Next Story