18 నుంచి మరోసారి జనతా కర్ఫ్యూ
By సుభాష్
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. అయితే ఈనెల 18 నుంచి మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరో సారి అక్కడి ప్రజలు కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మహమ్మారిపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో రెండు వారాల్లో కర్ఫ్యూ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 18 రాత్రి నుంచి సెప్టెంబర్ 21 ఉదయం వరకు, అలాగే 25 రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం వరకు ఈ జనతా కర్ఫ్యూ పాటించనున్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల నేపథ్యంలో సామాన్యులు చేసిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని నాగ్పూర్ మేయర్ సందీప్ జోషి పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు నుంచి ఇళ్లల్లోంచి ఎవరు కూడా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్తో పాటు సాంగ్లి, కొల్హాపూర్, జల్గావ్, రాయ్గడ్, ఔరంగాబాద్ లాంటి ఇతర పట్టణాల్లో 'ఈ జనతా కర్ఫ్యూలు' అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.