8న 'జగనన్న విద్యాకానుక'
By సుభాష్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా పరంగా దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోచదివే విద్యార్థుల కోసం 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఈనెల 8వ తేదీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని, సుమారు రూ.650 కోట్ల విలువైన కిట్లను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పథకంలో భాగంగా మూడు జతల దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్స్లు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగు అందిస్తారు. అలాగే బడిబయట పిల్లల సంఖ్య తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు శాతాన్ని పెంచడంతోపాటు అభ్యాసన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడమే కార్యక్రమం ఉద్దేశమని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు.