గంగూలీ చెప్పినట్లే.. వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్ 2020 వరల్డ్ రికార్డ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 11:40 AM GMT
గంగూలీ చెప్పినట్లే.. వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్ 2020 వరల్డ్ రికార్డ్

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి.. క్రికెట్‌ ప్రేమికులకు మంచి మాజా అందిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్‌లు జరిగినా.. ఫలితం తేలందుకు చివరి ఓవర్‌ వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. క్షణ క్షణం ఫలితాలు మారుతూ.. అభిమానులకు కిక్‌ ఇస్తోంది. ఇక ఈ లీగ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని లీగులు ఉన్నప్పటికి ఐపీఎల్‌కి ఉండే క్రేజే వేరేని మరోసారి నిరూపితమైంది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మద్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఆరంభ మ్యాచ్‌కు అదిరిపోయే వ్యూస్‌ వచ్చాయి. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం 20 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను చూశారు. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా, ఏ క్రీడలో అయినా.. ఏ దేశంలో అయినా టీవీ, డిజిటల్ వ్యూస్ పరంగా ఇది రికార్డు అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు.

ఇక కరోనా కారణంగా క్రీడాటోర్నీలు అన్ని రద్దవ్వడం.. క్యాష్ రిచ్ లీగ్ దుబాయ్‌కి తరలడం.. ఖాళీ స్టేడియాల్లో జరుగుతుండటంతో ఐపీఎల్‌కు వ్యూస్ తాకిడి పెరిగింది. గత ఆరు నెలలుగా క్రికెట్ టోర్నీలు జరగకపోవడంతో వ్యూయర్‌షిప్ పరంగా ఐపీఎల్ 2020 రికార్డులు బ్రేక్ చేస్తుందని గంగూలీ టోర్నీకి ముందే చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తరువాత మహేంద్రుడు మైదానంలో అడుగుపెట్టడం కూడా మ్యాచ్‌ వ్యూయర్‌ షిప్‌ పెరగడానికి ఓ కారణమని క్రీడాపండితులు అంచనా వేస్తున్నారు.



Next Story