టమాటల కోసం ఘర్షణ.. 20 మంది మృతి
Two groups clash for tomatoes 20 killed. గంపెడు టమాటల కోసం రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 20 మంది వరకు మరణించారు.
By Medi Samrat Published on 11 March 2021 11:13 AM GMT![Two groups clash for tomatoes 20 killed Two groups clash for tomatoes 20 killed](https://telugu.newsmeter.in/h-upload/2021/03/11/294479-two-groups-clash-for-tomatoes-20-killed.webp)
సాధారణంగా ఆస్తి వివాదాలు, మతపరమైన, కుటుంబ ఘర్షణలు జరుగుతుండగా మనం చూసే ఉంటాము. అలాగే పాత కక్షల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘర్షణ చోటు చేసుకోవడం అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తోంది. అందేంటంటే.. గంపెడు టమాటల కోసం 20 మంది వరకు మృతి చెందారు. ఏంటి టమాటల కోసం ఘర్షణ పడి చనిపోవడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. కానీ ఇది ఘర్షణ మన దేశంలో అనుకుంటే పొరపాటే. నైజీరియాలో చోటు చేసుకున్న ఘటన ఇది. గంపెడు టమాటల కోసం రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 20 మంది వరకు మరణించారు.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో టామట బుట్ట కారణంగా ఘర్షణ తలెత్తింది. దేశం ఉత్తరం, దక్షిణం అని రెండు విడిపోయింది. అయితే గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్ లోని మార్కెట్కు వెళ్తుండగా, ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి చెల్లాచెదురైపోయాయి. ఇది సమీపంలోని దుకాణాలు, పోర్టర్లలో వాదనకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అంతే.. టమాటల విషయంలో పెద్ద పోరాటమే జరిగిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన వార్తను ఓ వర్గం వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణ క్రైస్తవులు విడిపోయారు. ఈ ఉద్రిక్తత జరిగిన నాలుగు గంటల తర్వాత భారీ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. జనాలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఒక్క టమాటల కారణంగా తలెత్తిన ఘర్షణతో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు.