న్యూఇయ‌ర్‌కు రెండు నిమిషాల ముందు.. పార్టీలో కాల్పులు.. ముగ్గురు మృతి

Three dead in shooting at Mississippi New Year's party.కొత్త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికేందుకు అంద‌రూ ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jan 2022 4:58 AM GMT
న్యూఇయ‌ర్‌కు రెండు నిమిషాల ముందు.. పార్టీలో కాల్పులు.. ముగ్గురు మృతి

కొత్త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికేందుకు అంద‌రూ ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నారు. వేడుక‌ల్లో భాగంగా అక్క‌డ సంగీతం, ప‌టాకుల మోత‌తో హోరెత్తుతోంది. అయితే.. స‌రిగ్గా మ‌రో రెండు నిమిషంలో కొత్త సంవ‌త్స‌రం రాబోతుంద‌న‌గా కొంద‌రు దుండ‌గులు పౌరుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. కాల్పుల్లో ముగ్గురు మ‌ర‌ణించ‌గా.. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది.

స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మిసిసిపీ గ‌ల్ఫ్‌పోర్ట్‌లో ఓ పార్టీలో కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం కావ‌డానికి ముందు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో కొంద‌రు దుండ‌గులు స‌రిగ్గా శుక్ర‌వారం అర్థ‌రాత్రి 11.58 నిమిషాల‌కు పౌరుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. కాల్పుల శ‌బ్దం విన‌ప‌డ‌డంతో ప్ర‌జ‌లు ప‌రుగులు పెట్టారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అయితే దుండ‌గులు అప్ప‌టికే అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతులను కోరీ డుబోస్(23), సెడ్రిక్ మెక్‌కార్డ్(28), ఆబ్రే లూయిస్(22)గా గుర్తించారు. దుండ‌గుల కోసం వేట కొన‌సాగిస్తున్నారు. అటు దాయాది దేశం పాకిస్థాన్‌లోని​ అజ్మీర్​ నగ్రీలో కూడా కాల్పులు చోటు చేస‌కున్నాయి. 11 ఏళ్ల చిన్నారి మృతి చెంద‌గా.. 18 మంది గాయ‌ప‌డ్డారు.

Next Story