'తానా' బోర్డు డైరెక్ట‌ర్ ఇంట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌, ఇద్ద‌రు కుమార్తెల దుర్మ‌ర‌ణం

TANA Director Vasu's Family Killed In Road Accident.తానా బోర్డు డైరెక్టర్ వాసు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 3:02 AM GMT
తానా బోర్డు డైరెక్ట‌ర్ ఇంట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌, ఇద్ద‌రు కుమార్తెల దుర్మ‌ర‌ణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (వాసు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు దుర్మ‌ర‌ణం చెందారు.

కృష్ణా జిల్లా కురుమ‌ద్దాలికి చెందిన డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. 1995లో ఉన్న‌త విద్య అభ్య‌సించ‌డానికి అమెరికా వెళ్లారు. పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్ న‌గ‌రంలో స్థిర‌ప‌డ్డారు. 2017 నుంచి తానా బోర్డు స‌భ్యుడిగా సేవ‌లు అందిస్తున్నారు.

భార్య వాణి ఐటీ ఉద్యోగిని. ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి వైద్య విద్యను అభ్యసిస్తుండ‌గా చిన్న కుమార్తె 11వ తరగతి చ‌దువుతోంది. ఆదివారం ఉద‌యం 11.30గంట‌ల స‌మ‌యంలో కాలేజీ నుంచి కుమార్తెల‌ను తీసుకువ‌చ్చేందుకు వాణి కారులో వెళ్లారు. తిరుగు ప్ర‌యాణంలో టెక్సాస్ వాల‌ర్ కౌంటీలో వారు ప్ర‌యాణిస్తున్న కారును పిక‌ప్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా.. మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

భార్య‌. ఇద్ద‌రు కుమార్తెలు మ‌ర‌ణించారు అనే విష‌యం తెలిసి శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై తానా సభ్యులు, శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు శ్రీనివాస్‌కు మానసిక స్థైర్యం ఇవ్వాలని అభిలాషించారు.

Next Story