క్రూరమైన నేరాలకు పాల్పడిన.. 81 మందికి ఒకేసారి ఉరిశిక్ష

Saudi Arabia Executes 81 People In 1 Day. సౌదీ అరేబియా శనివారం ఉగ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించింది. కాగా రికార్డు స్థాయిలో 81

By అంజి  Published on  13 March 2022 7:24 AM GMT
క్రూరమైన నేరాలకు పాల్పడిన.. 81 మందికి ఒకేసారి ఉరిశిక్ష

సౌదీ అరేబియా శనివారం ఉగ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించింది. కాగా రికార్డు స్థాయిలో 81 మందికి మరణశిక్ష విధించింది. ఇది గత ఏడాది ఉరిశిక్ష పడిన వారి సంఖ్యను మించిపోయింది. అయితే నిందితులకు ఉరిశిక్ష విధించడం హక్కుల కార్యకర్తల నుండి విమర్శలను రేకెత్తించింది. నిందితులంతా "క్రూరమైన నేరాలకు పాల్పడినట్లు తేలింది" అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. వీరిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్-ఖైదా, యెమెన్ యొక్క హుతీ తిరుగుబాటు దళాలు, "ఇతర ఉగ్రవాద సంస్థల"తో సంబంధం ఉన్న దోషులు కూడా ఉన్నారని పేర్కొంది.

సంపన్న గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యధిక మరణశిక్షలను అమలు చేస్తోంది. గతంలో తల నరికి చంపడం ద్వారా తరచుగా మరణశిక్షలను అమలు చేసింది. ఉరితీయబడిన వారికి దేశంలో దాడులకు కుట్ర పన్నినందుకు, పెద్ద సంఖ్యలో పౌరులను, భద్రతా దళాల సభ్యులను హతమార్చినందుకు శిక్ష విధించబడింది. "ప్రభుత్వ సిబ్బందిని, ముఖ్యమైన ఆర్థిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం, చట్టాన్ని అమలు చేసే అధికారులను చంపడం, వారి శరీరాలను వైకల్యం చేయడం, పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకోవడానికి ల్యాండ్ మైన్‌లను పెట్టడం వంటి నేరారోపణలు ఉన్నాయి" అని సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది.

అపహరణ, చిత్రహింసలు, అత్యాచారం, దేశంలోకి ఆయుధాలు, బాంబులను అక్రమంగా రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించారు. మరణించిన 81 మందిలో 73 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్, ఒకరు సిరియా పౌరుడు ఉన్నారు. అయితే మరణశిక్షను ఎక్కడ, ఎలా అమలు చేశారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరణశిక్షకు గురైన వారందరినీ సౌదీ కోర్టుల్లో విచారించారని, 13 మంది న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఒక్కొక్కరికి మూడు వేర్వేరు దశల్లో విచారణ జరిగిందని ఎస్‌పీఏ తెలిపింది. శనివారం నాటి 81 మరణాల ప్రకటన 2021లో మొత్తం 69 మరణశిక్షల కంటే ఎక్కువ.

Next Story