ఖతార్లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో ఆరుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతార్ రక్షణ దళానికి చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ విషాదం నెలకొంది. రొటీన్ డ్యూటీలో భాగంగా గాలిలోకి ఎగిరిన హెలికాప్టర్, ఖతార్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గల్లంతైన ఏడో వ్యక్తి కోసం కోస్ట్ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ మరియు అంతర్గత భద్రతా దళాలకు (లెఖ్వియా) చెందిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగిన ప్రమాదమేనని, ఎటువంటి శత్రువుల ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు.