600 మంది తాలిబ‌న్ల మృతి.. 1000 మంది లొంగుబాటు...!

Over 600 From Taliban killed in Panjshir.అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్తగ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2021 7:26 AM GMT
600 మంది తాలిబ‌న్ల మృతి.. 1000 మంది లొంగుబాటు...!

అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్తగ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఒక్క ప్రాంతం అదే పంజ్‌షీర్‌ ప్రావిన్స్.. విష‌యంపై మాత్రం గంద‌ర‌గోళంగా ఉంది. మొత్తం దేశాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ప్ప‌టికి ఈ ప్రాంతం మాత్రం తాలిబ‌న్లు ప‌ట్టుసాధించ‌లేదు. నిన్న ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించ‌గా.. పంజ్‌షీర్ తిరుగుబాటు ద‌ళం దీనిని ఖండించింది. పంజ్‌షీర్ లొంగిపోలేద‌ని.. యుద్ద కొన‌సాగుతోంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ ప‌ర‌స్ప‌ర విరుద్ద ప్ర‌క‌ట‌న‌లు గంద‌ర‌గోళానికి దారి తీస్తున్నాయి.

కాగా.. పంజ్‌షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. 600 మంది తాలిబ‌న్ల‌ను తాము మ‌ట్టుబెట్టామ‌ని, మ‌రో వెయ్యి పై చిలుకు మంది తాలిబ‌న్లు లొంగిపోయిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు షంజ్‌షీర్ తిరుగుబాటు ద‌ళ ప్ర‌తినిధి ఫ‌హీం ద‌ష్టి తెలిపిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ప‌ర్యాన్ జిల్లాలో తాలిబ‌న్లు, రెసిస్టెన్స్ ద‌ళాల మ‌ధ్య భీక‌ర పోరాటం కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. తాలిబ‌న్ల ప్ర‌య‌త్నాల‌ను రెసిస్టెన్స్ ద‌ళాలు గ‌ట్టిగా తిప్పికొడుతున్నాయి. తాలిబ‌న్ల ప్ర‌వేశించే మార్గాల్లో ల్యాండ్‌మెన్స్ అమ‌ర్చ‌డంతో.. వారు ముందుకు వెళ్ల‌డం చాలా క‌ష్టంగా మారింద‌ని అంటున్నారు. ఇప్పటివరకూ పంజ్‌షీర్‌లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వ‌చ్చాయ‌ని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ వెల్లడించారు.

ఈ ప‌ర‌స్ప‌ర విరుద్ద ప్ర‌క‌ట‌న‌ల‌తో అక్క‌డ ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి ఏమీ అర్థం కావ‌డం లేదు. పంజ్‌షేర్‌లో పోరాడుతున్న ఇరు వ‌ర్గాల‌కు రానున్న కొన్ని వారాలు కీల‌కంగా బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అఫ్టానిస్థాన్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీర‌క ముందే .. యాంటీ తాలిబ‌న్ ద‌ళాల‌ను అణ‌గ‌దొక్కాల‌ని బావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Next Story