జైలు మీద బాంబులతో దాడి.. 1800 మంది ఖైదీలు పరార్

More than 1800 prisoners escape.నైజీరియా ఐమో రాష్ట్రంలోని ఒక జైలు మీద బాంబు దాడి జరిగింది. 1,800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 4:30 AM GMT
jail

నైజీరియా ఐమో రాష్ట్రంలోని ఒక జైలు మీద బాంబు దాడి జరిగింది. కొంతమంది సాయుధులు ఓవేరీ పట్టణంలోని జైలులోకి చొరబడి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు బాంబులతో పేల్చేశారు. ఇదే అవకాశం గా తీసుకొని 1,800 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. అయితే.. ఈ ఘటన తరువాత 35 మంది ఖైదీలు పారిపోవడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయారు. మరో ఆరుగురు బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. ఖైదీలు పారిపోయారని నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ ధ్రువీకరించింది. సోమవారం తెల్లవారుజామున సాయుధ గుంపులు బస్సులు, ట్రక్కులలో ఓవేరీ కస్టోడియల్ సెంటర్లోకి దూసుకొచ్చారని, వారి వద్ద బాంబులు, మెషీన్ గన్లతో పాటు రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ఈ ఘటనపై స్పందించారు. ఇది ఉన్మాదంతో కూడిన తీవ్రవాద చర్య అన్నారు. దాడి చేసిన వారిని, తప్పించుకున్న ఖైదీలను వెంటనే పట్టుకోవాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు. ఐమో రాష్ట్రం చాలా కాలంగా వేర్పాటువాదు ఉద్యమాలతో రక్తమోడుతోంది. ఇక్కడి స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జనవరి నెల నుంచి ఈ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లు, వాహనాల మీద దాడులు జరిగాయి. తుపాకులు, మందుగుండు సామగ్రిని భారీగా కొల్లగొట్టారు. నిషిద్ధ ఇండిజీనస్ పీపుల్ బయాఫ్రా సంస్థ ఈ దాడికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆ సంస్థ ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించినట్లు సమాచారం.




Next Story