42 మంది పాలస్తీనియన్ల హతం.. గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయన్న ఇజ్రాయెల్

Israel air strikes kill 42 Palestinians. ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపదిండి.

By Medi Samrat  Published on  17 May 2021 5:32 AM GMT
Israel air strikes

ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపదిండి. ఆదివారం నాడు చోటు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజా నగరంలోని మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. వారం రోజుల నుండి ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్‌ మిలటరీ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ఆదివారం అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా 42 ప్రాణాలను బలిగొంది. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 50 మంది గాయపడినట్లు వెల్లడించింది. గాజాలోని హమాస్‌ అగ్రనేత యాహియే సన్‌వార్‌ నివాసాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు.

హమాస్ ఉగ్రముఠాకు చెందిన కీలక నేత యాహియే సిన్వర్‌కు చెందిన ఇంటిని నేలమట్టం చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు గాజాపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

57 ఇస్లామిక్‌ దేశాల కూటమి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్‌ దేశాల కూటమి అభిప్రాయపడింది. యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని ఈ దేశాల కూటమి కూడా ప్రయత్నిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్న వీడియోలు, బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న జనం.. ఇలా విషాద ఛాయలు ఇరు దేశాల మధ్య అలముకున్నాయి.


Next Story