ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ట్రంప్ ప్రకటన
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ప్రాణాలు...
By - అంజి |
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ట్రంప్ ప్రకటన
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ధృవీకరించారు. "ఇది ఇరాన్ ప్రజలకు, అమెరికన్లకు మరియు ప్రపంచానికి దక్కిన న్యాయం" అని ఆయన అభివర్ణించారు. ఇరాన్ దళాలు ఇక పోరాడటానికి సిద్ధంగా లేవని, ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన పిలుపునిచ్చారు.
అయితే తమ సైనిక చర్య కొనసాగుతుందని హెచ్చరించారు. "చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు" అని ట్రంప్ రాశారు, ఈ అభివృద్ధిని "ఇరాన్ ప్రజలకు న్యాయం"గా అభివర్ణించారు. ఖమేనీ నాయకత్వంలో అమెరికన్లు, ఇతరులకు హాని జరిగిందని ఆయన అన్నారు. ఇరాన్ నాయకుడు "మా ఇంటెలిజెన్స్, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను తప్పించుకోలేకపోయాడు" అని ట్రంప్ అన్నారు. ఈ ఆపరేషన్ "ఇజ్రాయెల్తో దగ్గరగా పనిచేస్తూ" నిర్వహించబడిందని పేర్కొన్నారు.
దాడుల ప్రారంభంలోనే ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. నివాస సముదాయం పూర్తిగా ధ్వంసమైంది. తొలుత ఖమేనీ సురక్షిత ప్రాంతంలో ఉన్నారని, టీవీలో ప్రసంగిస్తారని ఇరాన్ వర్గాలు చెప్పినప్పటికీ.. అవేవీ జరగలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ ఇక 'లేరు' అని పరోక్షంగా సూచించారు. ఇరాన్ అధికారిక మీడియా మాత్రం ఇది శత్రువుల 'మైండ్ గేమ్' అని కొట్టిపారేస్తోంది.
తదుపరి పరిణామాలు:
ప్రస్తుతం ఇరాన్లోని 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' అత్యవసరంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే కీలక బాధ్యత వీరిపైనే ఉంటుంది. అధికారికంగా మరణవార్తను ప్రకటించే ముందు కొన్ని లాంఛనాలను పూర్తి చేసే ప్రక్రియలో ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది.