పశ్చిమాసియా సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ఇరాన్లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియనున్న తరుణంలో, అక్కడ ఉన్న భారతీయులు రాబోయే 48 గంటల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించింది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని, బహుళ అంతస్తుల భవనాలపై అంతస్తుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
హైవేలపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా ఎంబసీ సమన్వయంతోనే కదలాలని, హోటళ్లలో ఉన్నవారు లోపలే ఉంటూ అధికారులతో టచ్లో ఉండాలని కోరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ ఉద్రిక్తతల సమయంలో అక్కడ సుమారు 9,000 మంది భారతీయులు ఉండగా, ఇప్పటివరకు 1,800 మంది స్వదేశానికి చేరుకున్నారు. మిగిలిన వారు ఎంబసీ అందించే అధికారిక సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం వెల్లడించింది.