పాకిస్థాన్‌లోని క‌రాచీలో హిందూ దేవాల‌యం ధ్వంసం

Hindu temple vandalised in Pakistan's Karachi.పాకిస్థాన్‌లో హిందూ దేవాల‌యాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. తాజాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 5:38 AM GMT
పాకిస్థాన్‌లోని క‌రాచీలో హిందూ దేవాల‌యం ధ్వంసం

పాకిస్థాన్‌లో హిందూ దేవాల‌యాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. తాజాగా క‌రాచీలోని ఓ హిందూ దేవాల‌యంలోకి చొర‌బ‌డిన ఓ దుండ‌గుడు దేవ‌త విగ్ర‌హాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. గ‌మ‌నించిన స్థానికులు అత‌డిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. సోమ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

అక్క‌డి స్థానిక మీడియా వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు..రాంచోర్ లైన్ ఏరియాలో ఉన్న హిందూ దేవాల‌యంలోకి సోమ‌వారం ఓ వ్య‌క్తి ప్ర‌వేశించాడు. హిందూ దేవత జోగ్ మాయ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అత‌డిని పట్టుకుని స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు. నిందితుడిపై దైవదూషణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత మంజీందర్ సింగ్ సిర్సా ఖండిస్తూ ట్వీట్ చేశారు. మైనారిటీలపై రాజ్య మద్దతుతో కూడిన ఉగ్రవాదం అని అభివర్ణించారు. "రాంచోర్ లైన్‌లో మరో హిందూ దేవాలయాన్ని కరాచీ పాకిస్తాన్ దాడిదారులు అపవిత్రం చేశారు' ఇది పాకిస్థాన్‌లోని మైనారిటీలపై ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాదం' అని సిర్సా ట్వీట్‌ చేశారు.

"పాకిస్తాన్‌లోని మైనారిటీలు వారి విశ్వాసంపై ఇటువంటి నిరంతర దాడితో బాధపడుతున్నారు. అయితే పాక్ ప్రభుత్వం అలాంటి వేధింపులపై మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటుంది" అని సిర్సా జోడించారు.

గ‌త అక్టోబర్‌లో సింధ్ ప్రావిన్స్‌లోని హనుమాన్ దేవి మాత మందిరాన్ని గుర్తు తెలియని దొంగల బృందం అపవిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. దేవిమాత ఆలయంలో దొంగలు తాళాలు పగులగొట్టారు. దేవతల మెడలోని వెండి హారాలను తీయడమే కాకుండా ఆలయ విరాళాల పెట్టె నుంచి డబ్బులు చోరీ చేశారు.

Next Story