భారత్ కు గూగుల్ భారీ సాయం

Google pledges Rs 135 crore for Covid support in India. భారత్ కు రూ. 135 కోట్ల విరాళం అందిస్తున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు.

By Medi Samrat  Published on  26 April 2021 8:38 AM GMT
Google helps to India

భారత్ కు గూగుల్ సంస్థ భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. టెక్ దిగ్గజం గూగుల్ కరోనాతో పోరాడుతున్న భారత్ కు రూ. 135 కోట్ల విరాళం అందిస్తున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ ఫండ్ ను గివ్ ఇండియాకు, యూనిసెఫ్ కు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు.

భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చ‌డాన్ని చూసి త‌న హృద‌యం ముక్క‌లైందని మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌నాదెళ్ల తెలిపారు. క‌రోనా వేళ భార‌త్‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చిన అమెరికాకు స‌త్య‌నాదెళ్ల థ్యాంక్స్ చెప్పారు. ఆక్సిజ‌న్ ప‌రికరాలను కొనుగోలు చేసేందుకు వీలుగా భార‌త్‌కు ఈ స‌మ‌యంలో త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. భార‌త్ కు సాయం చేసేందుకు త‌మ కంపెనీ కూడా త‌మ వ‌న‌రుల‌ను ఉప‌యోగిస్తుంద‌ని చెప్పారు.

భారత్ కు టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను భారత్ కు పంపించాలని అమెరికా నిర్ణయించింది. దీంతోపాటు పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే దిశగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ముందుకు వచ్చాయి. సౌదీ అరేబియా కూడా భారత్ ను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. భార‌త్‌కు 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతున్న‌ట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అదానీ గ్రూపు, లిండే కంపెనీ సహకారంతో ఈ ఆక్సిజన్‌ పంపుతున్నట్లు వివ‌రించింది. అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యామ‌ని అన్నారు. తాజాగా 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో నాలుగు క్రయోజనిక్‌ ట్యాంకులు స‌ముద్ర మార్గం ద్వారా దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయని వివ‌రించారు.


Next Story