వైరస్‌ విజృంభణ.. పిల్లులను చంపేస్తోన్న చైనా దేశం..!

China kills 3 housecats that tested positive for covid-19.చైనాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండడంతో అక్కడి అధికారులు

By అంజి  Published on  30 Sep 2021 4:00 AM GMT
వైరస్‌ విజృంభణ.. పిల్లులను చంపేస్తోన్న చైనా దేశం..!

చైనాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలినా.. వెంటనే వారి ఉండే ప్రాంతంలోని వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరచైనాలోని ఓ నగరంలో మూడు పిల్లులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో.. అధికారులు వాటిని చంపివేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు లేవు. పిల్లుల ద్వారా వాటి యజమానులకు, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారికి ప్రమాదం ఉందని.. అందుకే పిల్లులను చంపివేశామని హర్బిన్‌ నగర అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 21వ తేదీన పిల్లులకు ఆహారం, నీటిని అందించిన తర్వాత.. పిల్లుల యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే అధికారులు పిల్లులకు టెస్ట్‌ చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో పిల్లులను అధికారులు చంపివేశారు. కాగా చైనాలో పెంపుడు జంతువులు చాలా మంది పెంచుకుంటారు. యుఎస్‌ఏ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్ ప్రకారం.. కొవిడ్‌-19కి కారణమయ్యే వైరస్‌ అయిన కరోనా జంతువులకు వ్యాపించే ప్రమాదం తక్కువ. అయితే మనుషులు ద్వారా జంతువులకు కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సీడీసీ పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తులు తమ పెంపుడు జంతువులు, పశువులు, వన్యప్రాణుల దగ్గరికి వెళ్లకూడదని తెలిపింది. చైనా దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పూర్తైనట్లు అధికారులు తెలిపారు.

Next Story