బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..18 రోజుల్లో ఆరవ ప్రాణం బలి

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, అస్థిర పరిస్థితుల మధ్య హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు.

By -  Knakam Karthik
Published on : 6 Jan 2026 10:05 AM IST

International News, Bangladesh, Hindu Man killed, Mani Chakraborty

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..18 రోజుల్లో ఆరవ ప్రాణం బలి

ఢాకా: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, అస్థిర పరిస్థితుల మధ్య హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గత 18 రోజుల్లో హిందూ సమాజానికి చెందిన ఆరవ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నర్సింగ్దీ జిల్లాలోని పాలాష్ ఉపజిల్లా పరిధిలో ఉన్న చార్సిందూర్ బజార్‌లో సోమవారం రాత్రి కిరాణా వ్యాపారి మణి చక్రబర్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మార్కెట్‌లో తన దుకాణం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరగగా, తీవ్రంగా గాయపడిన మణిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో లేదా ఆసుపత్రిలో చేరిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

మణి చక్రబర్తి శిబ్‌పూర్ ఉపజిల్లా సాదర్‌చర్ యూనియన్‌కు చెందినవాడు. మదన్ ఠాకూర్ కుమారుడైన మణి, శాంత స్వభావం కలిగిన వ్యక్తిగా, ఎలాంటి వ్యక్తిగత వివాదాలు లేని వ్యాపారిగా స్థానికులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లోనే హత్య జరగడం మైనారిటీల్లో భయాందోళనలను పెంచింది. ఇదే రోజు సాయంత్రం, జషోర్ జిల్లాలోని మనిరాంపూర్ ఉపజిల్లా కోపాలియా బజార్‌లో మరో హిందూ వ్యక్తి రణ ప్రతాప్ (45) కాల్పుల్లో మృతి చెందాడు. మార్కెట్‌లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మనిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఓసీ రాజియుల్లా ఖాన్ మాట్లాడుతూ, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం ప్రక్రియలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుల గుర్తింపు, అరెస్టుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇటీవలి రోజుల్లో మైనారిటీలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. దుస్తుల కర్మాగార కార్మికుడు దీపు చంద్ర దాస్ గుంపు దాడిలో లించ్‌కు గురయ్యాడు. అమృత్ మండల్, బజేంద్ర బిస్వాస్ కూడా హింసాత్మక ఘటనల్లో మృతి చెందారు.

డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలోని కెయుర్భంగా బజార్ వద్ద హిందూ వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్పై గుంపు దాడి చేసి కత్తులతో పొడిచి, నిప్పంటించారు. ఢాకాలోని నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. వరుస ఘటనలతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story