గాల్వన్ ఘటనలో 45 మంది చైనా జవాన్లు మృతి.. బయటపెట్టిన రష్యా వార్తాసంస్థ
45 Chinese soldiers killed in Galwan clash. లఢఖ్లో గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో45 మంది చైనా సైనికులు మృతి.
By Medi Samrat
లఢఖ్లో గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్త సంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులైనట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సూనికులు మరణించారన్న విషయాన్ని చైనా ప్రభుత్వం ప్రకటించలేదు. తాజాగా ఆ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజన్సీ తెలిపింది.
భారత్ - చైనా దేశాల సరిహద్దుల మధ్య 9 నెలులగా సాగుతున్న ప్రతిష్టంభణకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికలో గల్వాన్ ఘటనలో 45 మంది చైనా సైనికులు మరణించారని వెల్లడించింది. 20 మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా ఉటంకించింది.
సరిహద్దుల్లో తలెత్తిన వివాదం కారణంగా ఇరుదేశాలు దాదాపు 50 వేల మంది సైనికులను మోహరించాయని రష్యా మీడియా సంస్థ పేర్కొంది. అయితే ఈమధ్యే రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంతో పాటు ఇప్పటికే 9 దఫాల్లో కోర్ కమాండర్ స్థాయి చర్చల ఫలితంగా ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తాజాగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇరుదేశాలు మొదలు పెట్టాయి.
దీనిపై భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పార్లమెంట్లో వివరాలు వెల్లడించారు. బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికి వచ్చామని, దీని వల్ల భారత్ ఏమి నష్టపోలేదని స్పష్టం చేశారు. చైనాకు అంగుళం భూమి కూడా వదిలేది లేదని పార్లమెంట్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో జవాన్లు అత్యంత ధైర్య సహసాలను ప్రదర్శించారని అన్నారు. ఏ సమయంలోనైనా చైనాతో ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్దంగా ఉన్నాయని స్పష్టం చేశారు.