దక్షిణ బొలీవియాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ట్రక్కు సోమవారం తెల్లవారుజామున బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై నుంచి పక్కకు జారిపోయి 31 మంది మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసు ప్రతినిధి లింబర్ట్ చోక్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాద స్థలానికి అంబులెన్స్లు, అత్యవసర వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. మృతుల సంఖ్యను ధృవీకరించారు. వీరిలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఉన్నారని ఆయన అన్నారు. మరో 22 మంది గాయపడ్డారు.అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ సోషల్ మీడియాలో బాధితులకు సంతాపం తెలిపారు.
"ఈ దురదృష్టకర సంఘటనపై దర్యాప్తు చేయాలి" అని ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్లో అన్నారు. "ఈ క్లిష్ట సమయాలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని కోరుతూ, మృతుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము" అని పేర్కొన్నారు. శనివారం నాడు పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, 39 మంది గాయపడ్డారని పోలీసులు, స్థానిక అధికారులు చెప్పారని అల్ జజీరా నివేదించింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉయుని - కొల్చాని మధ్య రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులలో ఒకటి ఎదురుగా ఉన్న లేన్ లోకి దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.