లోయలో పడ్డ భారతీయులతో కూడిన బస్సు.. 18 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన పశ్చిమ మెక్సికోలో జరిగింది.

By అంజి  Published on  4 Aug 2023 3:50 AM GMT
Mexico, Road accident, US border

లోయలో పడ్డ భారతీయులతో కూడిన బస్సు.. 18 మంది మృతి 

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన పశ్చిమ మెక్సికోలో జరిగింది. ప్రయాణీకుల బస్సు గురువారం తెల్లవారుజామున హైవే నుండి లోయలో పడటంతో కనీసం 18 మంది మరణించారు. ప్రయాణీకులు ఎక్కువగా విదేశీయులు, కొంతమంది యూఎస్‌ సరిహద్దుకు వెళుతున్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఉత్తర సరిహద్దు పట్టణమైన టిజువానాకు వెళ్లే మార్గంలో బస్సులో భారతదేశం, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికన్ దేశాల పౌరులతో సహా 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు నయారిత్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అతను రోడ్డులోని వంపులో బస్సును వేగంగా నడుపుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు.

గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించి, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎలైట్ ప్యాసింజర్ లైన్‌లో భాగమైన బస్సు రాష్ట్ర రాజధాని టెపిక్ వెలుపల హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో బోల్తా పడిందని అధికారులు తెలిపారు. లోయ దాదాపు 40 మీటర్లు (131 అడుగులు) లోతులో ఉన్నందున, రెస్క్యూ "అత్యంత కష్టం"గా ఉందని నయారిత్ భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ తెలిపారు. ఈ ఘటనపై బస్ కంపెనీ లేదా మెక్సికో మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ వెంటనే స్పందించలేదు. గత నెలలో, దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బస్సు ప్రమాదంలో 29 మంది మరణించారు. ఫిబ్రవరిలో దక్షిణ,మధ్య అమెరికా నుండి వలస వచ్చిన బస్సు సెంట్రల్ మెక్సికోలో బోల్తా పడింది. దీంతో 17 మంది మరణించారు.

Next Story