బాంబును ఢీకొట్టిన బస్సు.. 11 మంది మృతి, 58 మందికి గాయాలు

11 killed, 58 injured after bus hit by bomb in Mali. ఆఫిక్రాలోని మాలీ దేశంలో భారీ పేలుడు సంభవించింది. మాలిలోని సెంట్రల్‌ ఏరియాలో గురువారం ఓ బస్సు

By అంజి
Published on : 14 Oct 2022 12:00 PM IST

బాంబును ఢీకొట్టిన బస్సు.. 11 మంది మృతి, 58 మందికి గాయాలు

ఆఫిక్రాలోని మాలీ దేశంలో భారీ పేలుడు సంభవించింది. మాలిలోని సెంట్రల్‌ ఏరియాలో గురువారం ఓ బస్సు గుర్తు తెలియని పేలుడు పదార్థాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో 58 మంది గాయపడ్డారని ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మోప్టి ప్రాంతంలోని బండియాగరా - గౌండక మధ్య రహదారిపై తెల్లవారుజామున పేలుడు సంభవించిందని భద్రతా వర్గాలు తెలిపాయి.

మోప్టీ ప్రాంతం జిహాదీ హింసకు కేంద్రంగా పిలువబడుతోంది. ఇక్కడ తరచూ ఉగ్రవాద హింసలు జరుగుతుంటాయి. రిపోర్టు ప్రకారం.. 11 మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ''మేము తొమ్మిది మృతదేహాలను ఆస్పత్రికి తరలించాం'' అని స్థానిక బండియాగరా యూత్ అసోసియేషన్‌కు చెందిన మౌసా హౌసేని అన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీ జిహాదిస్ట్ తిరుగుబాటుతో చాలా కాలంగా పోరాడుతోంది. దీని కారణంగా అక్కడ వేలాది మంది ప్రాణాలను బలవుతున్నాయి.

ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను జిహాదీలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 నాటికి ఐఈడీ పేలుళ్ల కారణంగా 72 మంది మరణించారు. గత ఏడాది ఐఈడీలు, గనుల కారణంగా 103 మంది ప్రాణాలు కోల్పోగా, 297 మంది గాయపడ్డారు.

Next Story