భారత వైద్యురాలికి అమెరికాలో అరుదైన గౌరవం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 April 2020 7:23 AM GMT
భారత వైద్యురాలికి అమెరికాలో అరుదైన గౌరవం

కరోనా వైరస్.. ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తుందో తెలీదు. ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవాలనే తలంపుతోనే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో సూచనలు కూడా చెప్పాయి. ఇక తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు మరికొందరు..! వైద్యులు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు.. ఇలా ఎంతో మంది ఈ మహమ్మారిని అడ్డుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా వైద్యులు కరోనా వైరస్ ను ఎదుర్కోడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తూ.. ఆ మహమ్మారి సోకడం వలన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చివరి క్షణాల్లో కూడా కరోనా మహమ్మారి మీద యుద్ధం చేశారు ఆ వైద్యులు. ఎంతో మంది వైద్యులు కరోనా పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం చెప్పండి.

డాక్టర్ ఉమా మధుసూదన్ అమెరికాలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. కోవిద్-19 రోగులకు ఆమె చికిత్స అందిస్తూ ఉంది. ఎంతో మంది రోగులకు ట్రీట్మెంట్ చేసింది ఉమా మధుసూదన్. మైసూర్ కు చెందిన ఈమె అమెరికాలోని సౌత్ విండ్సోర్ ఆసుపత్రిలో(South Windsor Hospital) ఈమె చికిత్స అందిస్తోంది. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ఆమె చూపిన తెగువను అక్కడి పోలీసు డిపార్ట్మెంట్, స్థానికులు తెగ ప్రశంసించారు.

ఆమె ఇంటి ముందు నిలబడగా.. పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, స్థానికులు వాహనాల్లో వచ్చి అభినందనలు తెలియజేసారు. పలువురు పిల్లలు ఆమెకు థాంక్స్ చెబుతూ ప్లకార్డులు పట్టుకున్నారు. మేడమ్.. మీరు ఎంతో ధైర్యవంతులు.. మీరు చేస్తున్న పనికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటామని పోలీసులు ఆమెకు చెప్పారు. ఓ పెద్ద కాన్వాయ్ ఆమె ఇంటి ముందుకు వచ్చి హారన్స్ తో థాంక్స్ చెబుతూ వెళ్లడంతో ఉమా మధుసూదన్ కళ్లు చెమ్మగిల్లాయి. ప్రవాస భారతీయులకు, భారతీయులకు ఇది ఎంతో గర్వకారణం.

Next Story