భార‌త్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 March 2020 2:49 AM GMT
భార‌త్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

భారత్‌ తొలి కరోనా మరణాన్ని తన ఖాతాలో వేసుకుంది. కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధఖీ(76) కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ మరణించారు. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు నిర్ధారించారు. జనవరిలో సౌదీ అరేబియాకు వెళ్లిన సిద్ధఖీ ఫిబ్రవరి 29న భార‌త్‌కు తిరిగి వచ్చారు.

భార‌త్‌కు తిరిగివ‌చ్చిన ఆయ‌న‌ దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆయనను 4వ తేదీన గుల్బర్గాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అంబులెన్స్‌లో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

అక్క‌డ ముందుగా.. జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ చేసుకోకపోవడంతో చివరకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ ఒకటిలో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు అప్పటికే సిద్దిఖీకి కరోనా సోకినట్లు అనుమానించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

కానీ సిద్దిఖీ బంధువులు.. అత‌నిని గాంధీకి తీసుకెళ్లకుండా ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో మంగళవారం మళ్లీ గుల్బార్గకు తీసుకెళ్లారు. మంగళవారం గుల్చార్గా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ వైద్యులు బాధితుని నుంచి నమూనాలు సేకరించి, బెంగళూర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. ఈ లోగా బాధితుడు మృతి చెందాడు. బాధితుడికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం సాయంత్రం వచ్చాయి. ఆ మెడికల్‌ రిపోర్ట్‌ల్లో అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

Next Story