భారత్ ఎయిర్చీఫ్ మార్షల్ రాకేష్ భదౌరియాకు తప్పిన ప్రమాదం..!
By అంజి Published on 6 Dec 2019 10:58 AM GMTఅమెరికాలో భారత్ ఎయిర్చీఫ్ మార్షల్ రాకేష్ భదౌరియాకు భారీ ప్రమాదం తప్పింది. బుధవారం హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్లో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతపై వైమానిక మార్షల్ సదస్సు జరిగింది. సదస్సులో భాగంగా వివిధ దేశాలకు చెందిన ఎయిర్ఛీప్లతో పాటు భారత ఎయిర్ఛీప్ రాకేష్ భదౌరియా కూడా పాల్గొన్నారు. అప్పటికే పెరల్ హార్బర్లోకి చొరబడిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్పుకొని దుండగుడు చనిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు అమెరికన్లు మృతి చెందారు. రాకేష్ భదౌరియా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం అధికారులు తెలిపారు. పెరల్ హార్బర్లోని వైమానిక దళ కేంద్రంలో సదస్సు జరుగుతుండగా నావికా దళ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుందని అమెరికా వాయుసేన అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హవాయి ప్రాంత నావికా దళ కమాండర్ అడ్మిన్ రాబర్ట్ పేర్కొన్నారు. కాల్పులకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. రేపటితో 1941 డిసెంబర్ 7న పెరల్ హార్బర్పై జరిగిన దాడికి 78 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.