భారత్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. 24 గంటల్లో 26,506 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 10 July 2020 6:29 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 475 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసలు ఇవే. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కి చేరింది. ఈ మహమ్మారి భారీన ఇప్పటి వరకు 21,604 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం నమోదు అయిన కేసుల్లో 4,95,513 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,76,685 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ కేసుల్లో 80 శాతం కేవలం 49 జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కరోనా బాధితుల రికవరీ రేటు 62.09శాతంగా ఉంది. ఇక ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.