ఆగని కరోనా విజృంభణ.. 24గంటల్లో 3697 కేసులు 100 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 15 May 2020 4:54 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,697 కేసులు నమోదు కాగా.. 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో 81,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి 2,649 మంది మృత్యువాత పడ్డారు. సగటున దేశంలో ప్రతి రోజు 3వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 27,290 మంది డిశ్చార్జి కాగా.. 51,401 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 9,674 కేసులు నమోదు కాగా 66 మంది మరణించారు. గుజరాత్లో 9,594 కేసులు నమోదు కాగా 586 మంది చనిపోయారు. ఢిల్లీలో 8,470 కేసులు నమోదు కాగా.. 115 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలో 2,205కేసులు నమోదు కాగా.. 48 మంది మరణించారు. తెలంగాణలో 1414 కేసులు నమోదు కాగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.