భారత్లో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 4213 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 11 May 2020 10:39 AM IST
భారత్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,213 కొత్త కేసులు నమోదు కాగా.. 97 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 67,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 2,206 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 20,917 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 44,029 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృతి చెందారు. గుజరాత్లో 8,194 కేసులు నమోదు కాగా.. 493 మరణించారు. తమిళనాడులో 7,200 , ఢిల్లీలో 6,932, మధ్యప్రదేశ్లో 3614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉంటే.. ఢిల్లి నుంచి 15 ప్రధాన నగరాలకు రేపటి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మంగళవారం బయలు దేరే ఈ రైళ్లకు సోమవారం సాయంత్రం ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం మధ్యాహ్నాం 3 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. వైరస్ను కట్టడి చేయడం, లాక్డౌన్ ఆంక్షల సడలింపు వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు.