జులైలో భార‌త్‌లో గ‌రిష్ట స్థాయికి క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2020 5:37 AM GMT
జులైలో భార‌త్‌లో గ‌రిష్ట స్థాయికి క‌రోనా

భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు ప్ర‌స్తుతం తక్కువ‌గానే న‌మోద‌వుతున్న జులైలో మాత్రం కేసుల సంఖ్య పీక్ స్టేజ్‌(గ‌రిష్ట స్ఘాయి)కి చేరుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ( ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ) రాయ‌బారి డేవిడ్ నబారో అంచనా వేశారు. భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి వేగ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం భార‌త్‌లో కేసుల సంఖ్య త‌క్కువ‌గా న‌మోదు అవుతున్నాయ‌న్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత కొంత‌కాలం పాటు కేసుల సంఖ్య పెరుగుతుంద‌ని, అయినా.. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. క్ర‌మ‌క్ర‌మంగా ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తుంద‌న్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల వైర‌స్‌ను కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం చేయ‌గ‌లిగామ‌న్నారు. భార‌త్‌లో కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి.. జ‌నాభాతో పోలిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసులు చాలా త‌క్కువేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

60 వేల‌కు చేరువ‌లో కేసులు..

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 3,320 కొత్త కేసులు న‌మోదు కాగా.. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 59,662 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 1,981 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 17,847 మంది డిశ్చార్జి కాగా.. 39,884 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 19,063 కేసులు న‌మోదు కాగా,, 731 మంది మ‌ర‌ణించారు. గుజరాత్‌లో 7402, ఢిల్లీలో 6318, మధ్యప్రదేశ్‌లో 3341, రాజస్తాన్‌లో 3579, తమిళనాడులో 6009, ఉత్తరప్రదేశ్‌లో 3214 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story