కొవిడ్‌ కేసుల్లో ఆరో స్థానానికి భారత్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 5:22 AM GMT
కొవిడ్‌ కేసుల్లో ఆరో స్థానానికి భారత్‌

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,887 కేసులు నమోదు కాగా.. 294 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,36,657 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 6,642 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,14,072 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,15,462 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత వారం రోజులుగా దేశంలో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా.. కొన్ని రోజులుగా ప్రతి రోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి ఎగబాకింది. ఇక కొవిడ్‌-19 మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68,50,236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 3,98,224 మంది మృత్యువాతపడ్డారు.

Next Story